Sanjay Raut: మహావికాస్‌ ఆఘాడి కూటమి బలంగా ఉంది  | Sakshi
Sakshi News home page

Sanjay Raut: మహావికాస్‌ ఆఘాడి కూటమి బలంగా ఉంది

Published Tue, Jun 22 2021 8:24 AM

Shiv Sena MP Sanjay Raut Says All Is Well With Alliance In Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య బంధం బలంగా ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వం ఎలా పని చేయాలో మహావికాస్‌ ఆఘాడీ కూటమిని చూసి నేర్చుకోవాలని సోమవారం పేర్కొన్నారు. తమ కూటమిలో చీలికలు తెచ్చే ప్రయత్నం ఫలించదని ప్రతిపక్ష పార్టీలకు ఆయన చురకలంటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మూడు పార్టీల సమన్వయంతో పాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ భవిష్యత్తులో కలసి పోటీ చేయాలా అన్న విషయంపై కాంగ్రెస్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మూడు పారీ్టల మధ్య ఉన్న బంధం రీత్యా అయిదేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో రౌత్‌ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత చేకూరింది. మరోవైపు ఈ నెల 10న శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. బీజేపీతో శివసేనకు దూరం పెరగడం వల్ల కేంద్ర విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనపై విచారణ జరుపుతోందని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై రౌత్‌ స్పందిస్తూ.. ప్రతాప్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని చెప్పారు. తమ పార్టీ స్టాండ్‌ ఇప్పటికే నిర్ణయమైందని చెప్పారు. కష్టకాలంలో ప్రతాప్‌కు పార్టీ తోడుంటుందని చెప్పారు. దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ ఎలా వేధిస్తుందో చెప్పడానికి పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ పార్టీ మంచి ఉదాహరణ అని చెప్పారు.

చదవండి: జూలై–ఆగస్టులో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంటుంది  

Advertisement
Advertisement