బినామీల కోసమే చంద్రబాబు పోరాటం

RK Roja Fires On Chandrababu Balakrishna - Sakshi

తండ్రికే అన్నం పెట్టని బాలకృష్ణకు విశ్వాసం ఉందా? 

పురందేశ్వరి ఒక ఊసరవెల్లి 

రాష్ట్ర మంత్రి ఆర్‌.కె.రోజా 

సింహాచలం: అమరావతిలో తన బినామీలు తీసుకున్న భూముల కోసమే చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని, రైతుల కోసం కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని ఆమె ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా పాదయాత్రగా ఉత్తరాంధ్రకు వస్తున్నారన్నారు.

అమరావతిలోనే రైతులు ఉన్నారా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో లేరా.. అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని చెప్పారు. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘బాలకృష్ణ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు.

అసలు విశ్వాసం లేనిది ఎవరికో ఆయన తెలుసుకోవాలి. సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి, చెప్పులేసి, పార్టీ లాక్కున్న చంద్రబాబుకు విశ్వాసం ఉందా? తండ్రికే అన్నం పెట్టని మీకు విశ్వాసం ఉందా ? పురందేశ్వరి చరిత్రను మరిచి మాట్లాడుతున్నారు. ఆమె ఒక ఊసరవెల్లిలా కాంగ్రెస్‌కు వెళ్లారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అందువల్లే హెల్త్‌ వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు’ అని రోజా అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top