
జబల్పూర్: మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం శ్రీకారం చుట్టారు. జబల్పూర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో గత 220 నెలల్లో 225 కుంభకోణాలు జరిగాయని.. అది బీజేపి ఘనతని ఆరోపించారు.
మధ్యప్రదేశ్లో ప్రతి నెలా ఒక కొత్త కుంభకోణం చోటుచేసుకుంటోందని దుయ్యబట్టారు. వ్యాపమ్, రేషన్ సరుకుల పంపిణీ, మైనింగ్, ఈ–టెండర్ వంటి వ్యవహారాలను ఆమె ప్రస్తావించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామని, వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని చెప్పారు.