పవన్, రజనీ రాజకీయాల్లో రాణించలేరు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సాక్షి, తిరుపతి : మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వాదిని తానేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ నిర్ణయాలు సంపన్నులకు సంక్షేమం, పేదలకు సంక్షోభంగా మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని, రాజధాని విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. (రజనీ రాజకీయ పార్టీ పొంగల్కు పక్కా!)
దేశంలో సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్లు మాత్రమే సక్సెస్ అయ్యారని, ఇప్పుడు ఆ రంగం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, వస్తున్న రజనీకాంత్లు ఇద్దరూ రాణించలేరని అన్నారు. వారు కళా రంగానికే సేవ చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. బిగ్బాస్ షోలో నాగార్జున మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించారని, ఈ అంశంపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు.