మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు మినహా అందరూ... | ministers in the previous Siddaramaiah led government now also | Sakshi
Sakshi News home page

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు మినహా అందరూ...

Jun 3 2026 7:20 PM | Updated on Jun 3 2026 7:52 PM

ministers in the previous Siddaramaiah led government now also

బెంగళూరు: డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీ పరమేశ్వర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  

కర్ణాటక కొత్త మంత్రివర్గంలో శివకుమార్‌ సహా ఇద్దరు నేతలు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు మంత్రులు మైనారిటీ వర్గాలకు చెందినవారు. పరమేశ్వర సహా ఇద్దరు మంత్రులు దళిత వర్గాలకు చెందినవారు.

జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, రామలింగ రెడ్డి, సతీశ్ జార్కిహోళి, యూటీ ఖాదర్, కృష్ణ బైరె గౌడ, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, శరణ ప్రకాశ్ పాటిల్, బైరతి సురేశ్‌, ఈశ్వర్ ఖండ్రే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఖాదర్, యతీంద్ర మినహా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గతంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. ఖాదర్ కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇక సిద్ధరామయ్య కుమారుడే యతీంద్ర. 

మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సిద్ధరామయ్య, శివకుమార్‌తో సమావేశమై కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్న నేతలపై మంగళవారం కూడా చర్చలు జరిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రెండో మంత్రివర్గ విస్తరణ రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంది.

గత వారం శివకుమార్‌ను కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ వివాదానికి ముగింపు పడింది. పదవి నుంచి వైదొలిగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే శివకుమార్ పేరును ప్రతిపాదించారు. పరమేశ్వర ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలోనే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నాయకత్వ పోటీ మొదటిసారి వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement