
నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి. నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అంటున్నాడు. సోనియా గాంధీ కాలు మొక్కాడు కేసీఆర్. కేసీఆర్ నీది నోరా.. మోరీనా?, తెలంగాణను మొత్తం దోచుకుతిన్నారు. దళితుడిని సీఎం చేస్తానని , మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా ?, కేసీఆర్.. మేం అనుకుంటే నల్గగొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం. ధరణితో ఏం మోసాలు చేశారో అన్నీ బయటపడతాయి’ అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.
తెలంగాణ.. బీఆర్ఎస్ సొంతం కాదు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. ‘వందల కోట్ల అవినీతి సొమ్ముతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు. నిన్ను ఫాంహౌస్ కు ఎందుకు పరిమితం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. దమ్ముంటే రా.మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి.
కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెప్తున్నాం. వెయ్యి జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో రైతులకు మేలు జరగలేదు. బీఆర్ఎస్ ఆగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు. తెలంగాణ కోసం కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు. నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.
