అంబేడ్కర్‌ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు  | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు 

Published Mon, Jun 14 2021 2:41 PM

Mehbooba: Even Ambedkar Would Have Been Slandered As Pro Pakistan By BJP - Sakshi

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370కి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడడాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఇప్పుడు మనమధ్య లేరని, ఒకవేళ జీవించి ఉంటే ఆయన పాకిస్తాన్‌ మద్దతుదారుడంటూ బీజేపీ నాయకులు దూషించేవారని అన్నారు. అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం కూలదోసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలి: రవిశంకర్‌ 
ఆర్టికల్‌ 370 విషయంలో దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం వైఖరేంటో స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు. దిగ్విజయ్‌ చెప్పినట్లుగా ఆర్టికల్‌ 370ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement