13న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు  | Sakshi
Sakshi News home page

13న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు 

Published Sat, Jul 8 2023 3:40 AM

Local body by elections on 13 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో విడత స్థానిక  సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థల్లో రాజీనామా లేదా మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు పరోక్ష పద్ధతిలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులతో పాటు పెడన మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ పదవిని భర్తీ చేస్తారు.

అలాగే మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీల్లో రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మొత్తం 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో– ఆప్షన్‌ సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవులకు కూడా ఎన్నికలు ఉంటాయని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు.

ఈ నెల 13న ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటీసులను ఆయా స్థానిక సంస్థల సభ్యులకు ఈ నెల 9 కల్లా అందజేయాలని ఆదేశించారు. 

ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4) 
రామకుప్పం (చిత్తూరు), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్‌), చేజెర్ల (నెల్లూరు)

కో– ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు జరిగే మండలాలు (3) 
చిత్తూరు, బి.మఠం (వైఎస్సార్‌), రాజంపేట (అన్నమయ్య)  

ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7)  
రామకుప్పం, విజయాపురం (చిత్తూరు), రాపూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం).  

ఉప సర్పంచ్‌ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు (12) 
అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి.. శ్రీకాకుళం,  విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి,  అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున.  

Advertisement
Advertisement