
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతోపాటు ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని కేటీఆర్ను అడిగారు. ఇదే అంశంపై కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో 2024లో ఫోన్లు మార్చాను. గతంలో వాడిన ఫోన్లు నా దగ్గర లేవు. 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని అడిగిన ఏసీబీ. ఫోన్లు అడగడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని అందులో పేర్కొన్నారు.
ఏసీబీ అధికారులు ఫోన్లను అడగడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్టాప్ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్కు న్యాయవాదులు వివరించినట్లు సమాచారం.