కేసీఆర్‌, మమతా, విజయన్‌ లాంటివారే మోదీని గద్దె దించగలరు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, మమతా, విజయన్‌ లాంటివారే మోదీని గద్దె దించగలరు: కేటీఆర్‌

Published Sat, Jan 27 2024 1:40 PM

KTR Aggressive Comments on Congress Government At Yousufguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోసం చేయడమే కాంగ్రెస్‌ నైజమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బస్సు ఉచితం, బంగారం ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారని.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం  విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. నేరవేరని, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని అన్నారు. 

ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపుతో సమాధానం చెప్పాలని తెలిపారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌తో కాదని.. అందుకే కూటమిలో నుంచి నేతలు బయటకు పోతున్నారని అన్నారు. దేశంలోని పార్టీలన్నింటిని కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్‌ బిల్డప్‌ ఇచ్చిందని మండిపడ్డారు. కూటమికి బిహార్‌లో నితీష్‌ కుమార్‌ కూడా బైబై చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌ లాంటివారే నరేంద్ర మోదీని గద్దె దించగలరని అన్నారు.
చదవండి: Delhi: బీజేపీపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

పథకాలు తెచ్చే ముందు అన్నీ ఆలోచించుకోవాలని కాంగ్రెస్‌కు చురకలంటించారు. కాంగ్రెస్‌ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని, వారికి ఫెవికాల్‌ బంధమని విమర్శలు గుప్పించారు. ఎదో ఒక షరతుపెట్టి పథకాలు రాకుండా చేస్తారని.. పార్లమెంట్‌ ఎన్నికల గండాన్ని ఎలా దాటలనేదే కాంగ్రెస్‌ ఆలోచన అని తెలిపారు. తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు పంపిస్తే రాజకీయ సంబంధాలు ఉన్నాయని గవర్నర్‌ తిరస్కరించారన్నా కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డి వెళ్లి గవర్నర్‌ను కలవగానే ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని గుర్తు చేశారు.

‘అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కొన్ని జిల్లాలో ఓటమి చెందాం. రాష్ట్రం బాగుంటుందని జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ క్లీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్‌లో వచ్చిన ఫలితాలు జిల్లాల్లో ఎందుకు రాలేదని పార్టీ క్యాడర్ అనుకుంటుంది. ఇవాళ మనకు జరిగింది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఏ మాత్రం నిరాశ చెందకూడదు. కేసీఆర్ బలంగా ఉన్నారని తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పలితాలు సాధించాలి.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పెలుతున్నారు. బంగారు పళ్లెంలో తెలంగాణ అభివృద్ది చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టాం. రాహుల్ జోడో యాత్ర అని తిరుగుతుంటే, ఇండియా కూటమి రాహుల్‌ను కాదని చోడో అని వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నిర్వీర్యం అవుతోంది. మహాలక్ష్మి పథకం పెట్టి మహిళల మధ్య గొడవలు పెట్టారు. ఫ్రీ బస్సు మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాలి.

 రాష్టంలో కోటి 57 లక్షల మంది మహిళలకు 2500/- రూపాయలు ఇస్తామన్నారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. కరెంటు బిల్లులు సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు కడుతుందా ఆలోచించాలి. కిషన్ రెడ్డి అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయి సానుభూతితో ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి అయ్యాక ఒక బస్తీకి అయినా మంచి పనిచేశారా’ అని మండిపడ్డారు కేటీఆర్‌....
చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..

Advertisement
Advertisement