నేడో రేపో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా?
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల క్రితం వరకూ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ మాజీ మంత్రి అయ్యారు. భూకబ్జా ఆరోపణల ప్రకంపనలు రావడంతో వేగంగా పరిణామాలు మారాయి. మొదట భూకబ్జా ఆరోపణలు బహిర్గతం కావడం.. అదే రోజు విచారణ. రెండోరోజు ఈటల వద్ద నుంచి ఆరోగ్య శాఖ లాక్కోవడం.. ఆ తదుపరి మూడో రోజు మంత్రిత్వ శాఖ నుంచి తొలగించడంతో ఈటల ఎపిసోడ్ సమాప్తం అయ్యింది. ఇక మిగిలింది టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడమే.
మంత్రివర్గం తొలిగించిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ తొలిసారి తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్కు చేరుకున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్ శివారు శామీర్పేటలోని తన నివాసానికే పరిమితమైన ఈటల మాజీ మంత్రిగా తన నియోజకవర్గానికి వెళ్లారు. అయితే అప్పటికే తన నివాసానికి భారీగా అభిమానులు, తన మద్దతుదారులు రావడంతో వారితో కలిసి ఈటల రాజేందర్ భారీ కాన్వాయ్తో హుజురాబాద్కు పయనమయ్యారు. మార్గమధ్యలో అక్కడక్కడ అభిమానులు, నాయకులు ఈటలను కలిసి సంఘీభావం తెలిపారు.
దారిపొడవునా ఈటలకు అనుకూలంగా, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అంతకుముందే హైదరాబాద్లో ఈటల అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా అంశం హాట్ టాపిక్గా మారింది. తనపై అకారణంగా.. ఉద్దేశపూర్వకంగా అవినీతి ఆరోపణలు చేయడం.. కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అద్భుత మెజార్టీతో గెలవాలని ఈటల ప్లాన్ అని తెలుస్తోంది. భారీ మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్కు తన బలం చెప్పాలని భావిస్తున్నారు.
అంందులో భాగంగా ఈటల రాజేందర్ నేడో.. రేపో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అందులో భాగంగా హుజురాబాద్కు చేరుకున్న ఈటల రాజేందర్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోని కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర
చదవండి: ఓడిపోయిన మమతాకు ఉన్న ఒకేదారి ఏమిటో తెలుసా..?