మంథని లిఫ్ట్‌ పనుల్లో అలసత్వం ఎందుకు? | Duddilla Sridhar Babu Questioned About Manthani Lift Irrigation Scheme | Sakshi
Sakshi News home page

మంథని లిఫ్ట్‌ పనుల్లో అలసత్వం ఎందుకు?

Aug 31 2021 1:45 AM | Updated on Aug 31 2021 1:45 AM

Duddilla Sridhar Babu Questioned About Manthani Lift Irrigation Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంథని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్‌ వివరాలు కోరారు.

దీంతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్‌ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్‌ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

ఏఐబీపీ కింద ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై  ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement