పార్టీ మారినా.. ఓటమి తప్పలే..!  | Defeat is inevitable even if the party changes | Sakshi
Sakshi News home page

పార్టీ మారినా.. ఓటమి తప్పలే..! 

Dec 4 2023 4:07 AM | Updated on Dec 4 2023 4:07 AM

Defeat is inevitable even if the party changes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ 2018 ఎన్నికల్లో గెలుపొందిన విపక్ష ఎమ్మెల్యేల్లో 16 మంది బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరికి ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్‌  టికెట్‌ నిరాకరించడంతో 14 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌ –ఎస్టీ), స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావ్యుడా రాములు నాయక్‌ (వైరా ఎస్టీ) బీఆర్‌ఎస్‌లో చేరినా ప్రస్తుత ఎన్నికలో టికెట్‌ దక్కలేదు.

గత ఎన్నికలో టీడీపీ నుంచి గెలుపొందిన మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట ఎస్టీ), సండ్ర వెంకట వీర య్య (సత్తుపల్లి ఎస్సీ)తో పాటు కాంగ్రెస్‌ నుంచి 12 మంది కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్‌ (ఎల్లారెడ్డి), సుదీర్‌రెడ్డి (ఎల్‌బీ నగర్‌), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌ ఎస్సీ), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), రేగా కాంతారావు (పినపాక ఎస్టీ), హరిప్రియ భానోత్‌ (ఇల్లందు ఎస్టీ), కందాల ఉపేందర్‌ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌ ఎస్టీ) బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్‌) మాత్రమే తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 

బీఆర్‌ఎస్‌ వీడి.. గెలుపుతీరానికి చేరి.. 
బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరి టికెట్లు దక్కించుకున్న పలువురు నేతలు గెలుపు తీరాలకు చేరారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా నిరాకరించి కాంగ్రెస్‌లోకి వెళ్లి తనతో పాటు తన కుమారుడికి టికెట్‌ సాధించుకున్న మైనంపల్లి హన్మంతరావు మాత్రం ఓటమి చెందారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), వేముల వీరేశం (నకిరేకల్‌), మందుల సామేలు (తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వర్‌రావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), మనోహర్‌రెడ్డి (తాండూరు), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), కూచుకుళ్ల రాకేశ్‌ రెడ్డి (ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి కుమారుడు), వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌) గెలుపొందారు.

సరితా తిరుపతయ్య (గద్వాల), శ్యామ్‌ నాయక్‌ (ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ భర్త – ఆసిఫాబాద్‌), జగదీశ్వర్‌ గౌడ్‌ (శేరిలింగంపల్లి) తదితరులు కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకున్నా గెలుపు తీరాలకు చేరలేక పోయారు. బోగా శ్రావణి (జగిత్యాల), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), కందుల సంధ్యారాణి (రామగుండం), పులిమామిడి రాజు (సంగారెడ్డి), కేసీఆర్‌ రత్నం (చేవెళ్ల) బీజేపీలో, నీలం మధు (పటాన్‌చెరు) బీఎస్పీలో చేరి టికెట్లు దక్కించుకున్నా ఫలితం లేకపోయింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement