బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని లోక్ భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు.
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసినవారు
డీకే శివకుమార్
జీ పరమేశ్వర్
కె హెచ్ మునియప్ప
కె జే జార్జ్
ఎం బీ పాటిల్
రామలింగ రెడ్డి
సతీశ్ జరకిహోళి
కృష్ణ బైరెగౌడ
ప్రియాంక్ ఖర్గే
యూటీ ఖాదర్
ఈశ్వర్ ఖండ్రే
యతీంద్ర సిద్ధరామయ్య
బైరతి సురేశ్
శరణ ప్రకాశ్ పాటిల్
భద్రత కట్టుదిట్టం
లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డీకే శివకుమార్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. శివకుమార్ను అభినందిస్తూ నగరమంతా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న సిద్ధరామయ్యకు శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కాంగ్రెస్లో కీలక బాధ్యత లభించింది.
ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కర్ణాటకలో దీర్ఘకాలంగా సాగిన పోరు తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2023 మేలో అధికారంలోకి వచ్చింది.

సోనియా గాంధీ సందేశం
డీకే శివకుమార్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. “అందరినీ కలుపుకుని ముందుకు సాగండి. మీరు కర్ణాటకకు విజయవంతంగా నాయకత్వం వహిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీ కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించండి” అని ఆమె చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖులు డీకే శివకుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.


