
సాక్షి,న్యూఢిల్లీ: మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం(జనవరి31) ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది.
కాగా, తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.