కాంగ్రెస్‌ నేతలు కనిపిస్తే.. జనం కొట్టేలా ఉన్నారు: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలు కనిపిస్తే.. జనం కొట్టేలా ఉన్నారు: కేటీఆర్‌

Feb 9 2025 5:51 AM | Updated on Feb 9 2025 5:51 AM

BRS Leader KTR Fires On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్‌ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునే వారు..’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. 

తెలంగాణ భవన్‌లో శనివారం వేర్వేరుగా జరిగిన సిర్పూర్‌ కాగజ్‌నగర్,వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఏడాది లోపే కాంగ్రెస్‌ దగాకోరు విధానాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని.. రేవంత్‌రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉండదని విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని ఆరోపించారు. 

రేవంత్‌ ఐరన్‌ లెగ్‌ సీఎం.. 
‘‘ఐరన్‌ లెగ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్‌కు గుండు సున్నా తీసుకువచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్‌ పతనాన్ని ప్రారంభించి ఢిల్లీలో ముగించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశంలో బీజేపీ, ప్రధాని మోదీకి అతిపెద్ద కార్యకర్తలా పనిచేస్తున్నారు. 

రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఎనిమిది మంది చొప్పున గెలిచినా బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది శూన్యం..’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క బీజేపీ ఎంపీ నోరు మెదపలేదేమని ప్రశ్నించారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే కేంద్రాన్ని నిలదీసేవారని చెప్పారు. 

మోసగాళ్లంతా వెళ్లిపోయారు 
‘‘మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వడానికి వణికిపోతున్నారు..’’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

గత పదేళ్లలో పేదల సంక్షేమం కోసం అనేక మంచి పనులు చేసిన కేసీఆర్‌.. సూర్యుడి తరహాలో కొంతకాలం మబ్బుల చాటుకు వెళ్లారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తమతో కలసి పనిచేసేందుకు అధికార పార్టీ ఆహ్వానాన్ని పక్కనపెట్టి మరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. 

చిన్న చిన్న తప్పుల వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని పేర్కొన్నారు. మరో పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. గెలిచే అభ్యర్థులకు అవకాశాలు ఇస్తామని, కలసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

నేడు బీఆర్‌ఎస్‌ బీసీ ముఖ్య నేతల భేటీ 
రాష్ట్రంలో కులగణన లోటుపాట్లను ఎత్తిచూపడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఆదివారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కలిపి సుమారు 500 మందికిపైగా ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ బీసీ నేతల సమావేశంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

బీజేపీని గెలిపించిన రాహుల్‌ గాం«దీకి కంగ్రాట్స్‌! 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటూ గెలవకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘బీజేపీని గెలిపించినందుకు రాహుల్‌ గాం«దీకి కంగ్రాట్స్‌’’అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement