చంద్ర‌బాబు నిజంగా ఢిల్లీకి వ‌చ్చారా.. బీజేపీ సెటైర్లు | BJP National Secretary Sunil Deodhar Satires Chandrababu Delhi Tour | Sakshi
Sakshi News home page

చంద్ర‌బాబు నిజంగా ఢిల్లీకి వ‌చ్చారా.. బీజేపీ సెటైర్లు

Oct 27 2021 6:20 PM | Updated on Oct 27 2021 6:37 PM

BJP National Secretary Sunil Deodhar Satires Chandrababu Delhi Tour - Sakshi

సునీల్ దేవ‌ధ‌ర్ ప్రెస్‌మీట్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే, చంద్ర‌బాబుకు అమిత్ షా ఫోన్ చేశార‌ని ఎల్లో మీడియా లీకులు ప్ర‌సారం చేసింది.

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉనికిని సైతం గుర్తించ‌డానికి బీజేపీ అధిష్టానం ఇష్ట‌ప‌డ‌డం లేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నార‌న్న సంగ‌తి సైతం త‌మ‌కు తెలియ‌ద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి, హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం బాబు హ‌స్తిన‌లో రెండు రోజుల పాటు ప‌డిగాపులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీ పెద్ద‌లు మాత్రం ఆయ‌న ఢిల్లీకి వ‌చ్చారా.. అని సెటైర్లు వేస్తున్నారు. 

దీన్‌ద‌యాల్ రోడ్డులోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి ఏపీ ఇన్‌చార్జి సునీల్ దేవ‌ధ‌ర్‌, ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావుతో క‌లిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై మీడియా ప్ర‌శ్న‌ల‌డ‌గ్గా, చంద్ర‌బాబు నిజంగా ఢిల్లీకి వ‌చ్చారా అని సునీల్ దేవ‌ధ‌ర్ ఎదురు ప్ర‌శ్నల‌తో సెటైర్లు వేశారు.

చంద్ర‌బాబు ఉనికిని సైతం గుర్తించ‌డానికి బీజేపీ ఇష్ట‌ప‌డ‌డం లేద‌న‌డానికి ఇదే ఉదాహార‌ణ అని ప‌లువురు అంటున్నారు. అంతేకాక, భ‌విష్య‌త్‌లో జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్ర‌శ్న‌లేద‌ని స్ప‌ష్టంగా తేల్చిచెప్పారు. టీడీపీ.. రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం అంటూ ముక్తాయింపు ఇవ్వ‌డం కొస‌మెరుపు. 
(చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ, అమిత్‌ షా)

నిజానికి సునీల్ దేవ‌ధ‌ర్ ప్రెస్‌మీట్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే, చంద్ర‌బాబుకు అమిత్ షా ఫోన్ చేశార‌ని ఎల్లో మీడియా లీకులు ప్ర‌సారం చేసింది. రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాలు చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్లు, ఆ విష‌యాల‌ను ప‌రిశీలిస్తాన‌ని షా చెప్పిన‌ట్లు ప్ర‌చారం చేశారు. అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారా లేదా అన్న‌దానిపై అమిత్ షా కార్యాల‌య‌వ‌ర్గాలేవీ స్పందించ‌లేదు. 
(చదవండి: ‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’)

అమిత్ షా అపాయింట్‌మెంట్ దొర‌క్క అభాసుపాలైన బాబుకు ఫేస్ సేవింగ్ కోసం ఎల్లో మీడియా ఈ  ప్ర‌చారం చేప‌ట్టింద‌నే గుస‌గుస‌లు వినిపించాయి. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఢిల్లీకి వ‌చ్చారా అని ఏపి బిజెపి వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి అని ప్ర‌శ్నించ‌డంతో, ఎల్లో మీడియా ప్ర‌చారం అంతా వ‌ట్టిదేన‌ని తేలిపోయిందంటున్నారు. మోడీ, షాల ప‌ట్ల చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరును బిజెపి పెద్ద‌లు మ‌రిచిపోలేద‌న‌డానికి ఇదొక తాజా నిద‌ర్శ‌నమ‌ని అంటున్నారు. 

చదవండి: ద్వంద్వనీతితో రుబాబు

Advertisement
 
Advertisement
Advertisement