రాసిపెట్టుకోండి.. సింహం సింగిల్గానే వస్తుంది: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తే, పవన్ కల్యాణ్ ప్యాకేజ్ కోసం ఆరాటపడుతుంటాడని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. వారేమీ కొత్త ప్రత్యామ్నాయం కాదని, కలిసే ఉన్నారని దుయబ్బటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీ ముగ్గురూ కలిసే వచ్చారని, గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసి విడిపోయారని గుర్తు చేశారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు వైఎస్సార్ సీపీకి పడకుండా ప్యాకేజ్ తీసుకుని పవన్ పోటీ చేశాడని గుర్తు చేశారు.
‘సింహం సింగిల్ గానే వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వైఎస్సార్ సీపీ పార్టీ ఒకవైపు.. మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు. చంద్రబాబు, సొంతపుత్రుడు, దత్తపుత్రుడు అందరూ కలగూరగంపలా కలిసొచ్చినా ఏమీ చేయలేరు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేదే లేదు. 45 లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? 60 లక్షల మందికి రైతుభరోసా కల్పిస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? 26 లక్షల మందికి చేయూత ఇస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? 85 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నందుకు ఉంటుందా? ఒకటో తేదీన పింఛన్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నందుకు ఉంటుందా?
చదవండి: వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు. అధికారం కోసమే బాబు, పవన్ ఆరాటం. చంద్రబాబు ఒక్కడే రాలేడు. జగనన్నను ఢీకొట్టలేడు. పవన్ కల్యాణ్కు సీఎం జగన్తో పోటీ పడే సత్తా అసలే లేదు. చంద్రబాబు, పవన్లు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారు. మనసున్న సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారని జనం బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు, పవన్లు చేసిన పాపాలను జనం మర్చిపోలేదు. టీడీపీ సింగిల్ఆ పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పగలడా. చంద్రబాబు పవన్ కాళ్లు పట్టుకున్నా, పవన్ చంద్రబాబు కాళ్లుపట్టుకున్నా, తలకిందులా తపస్సు చేసినా, సీఎం జగన్ను, వైస్సార్ కాంగ్రెస్ను అంగుళం కూడా కదల్చలేరు. 2024లో వైఎస్ జగన్ సింగిల్గానే రాబోతున్నారు. విజయదుందుభి మోగించనున్నారు. రాసిపెట్టుకోండి’ అంటూ టీడీపీ, పవన్పై నిప్పులు చెరిగారు.