‘ఈ పదేళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే!’ | Amit Shah Release Jammu and Kashmir Manifesto | Sakshi
Sakshi News home page

‘ఈ పదేళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే!’

Sep 6 2024 8:09 PM | Updated on Sep 6 2024 8:26 PM

Amit Shah Release Jammu and Kashmir Manifesto

జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి అధికరణ 370.. కనుమరుగైన చరిత్ర అని, అది ఎన్నటికీ మళ్లీ తెర మీదకు రాబోదని బీజేపీ సీనియర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుండబద్ధలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో శుక్రవారం బీజేపీ ఎన్నికల  మేనిఫెస్టో విడుదల చేశారాయన.

భారత దేశ చరిత్ర.. అందులో జమ్ము కశ్మీర్‌కంటూ కొన్ని పేజీలుంటే 2014-2024 మధ్య పాలనను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. కానీ, ఒక్క విషయం స్పష్టం చేయదల్చుకున్న. ఆర్టికల్‌ 370 ఎన్నటికీ తిరిగి రాదు. అది గతించిన అధ్యాయం అని అన్నారాయన.

బీజేపీ పాలనకు ముందు జమ్ము కశ్మీర్‌ ఎలా ఉండేదో దేశం మొత్తానికి తెలుసు. 2014 దాకా ఉగ్రవాదంతో పాటు వేర్పాటువాదం ఇక్కడ రాజ్యమేలేవి. ఇక్కడి పరిస్థితులను కొందరు అవకాశవాద రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. కానీ, బీజేపీ పదేళ్ల పాలనలో ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా కట్టడి అయ్యాయి అని పేర్కొన్నారు. 

1947 నుంచే జమ్ము కశ్మీర్‌ మా హృదయాలకు దగ్గరగా ఉండేది. ఇది ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే. ఇక్కడ శాంతి స్థాపనే మా ముందున్న లక్ష్యం. వచ్చే ఐదేళ్ల కోసం ప్రభుత్వ ఏర్పాటునకు మాకు ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో జమ్మును చేరుస్తాం అని అని అమిత్‌ షా ప్రసంగించారు


బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..

  • జమ్ము కశ్మీర్‌ రాజౌరిలో టూరిస్ట్‌ హబ్‌ ఏర్పాటు. తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పన.

  • తికా లాల్‌ తప్లూ విస్తాపిత్‌ సమాజ్‌ పురన్వాస్‌ యోజన (TLTVPY) పేరిట కశ్మీర్‌ పండిట్లను సురక్షితంగా వెనక్కి రప్పించడం.. వాళ్లకు భద్రత కల్పించడం

  • జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం సమూల నిర్మూలన.. అందుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల

 

 

కూటమిపై విసుర్లు
అదే సమయంలో.. కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌వి అవకాశవాద రాజకీయమని షా మండిపడ్డారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మేనిఫెస్టోను ప్రస్తావించిన ఆయన.. ఒక రాజకీయ పార్టీ అలాంటి మేనిఫెస్టో ఎలా పెడుతుంది?.  దానికి కాంగ్రెస్‌లాంటి జాతీయ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది?. ఈ విషయంలో రాహుల్‌ గాంధీ స్పష్టత ఇవ్వాలి.. అని కోరారాయన.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు దశల్లో సెప్టెంబర్‌ 18, సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1 పోలింగ్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement