పెద్దపల్లి: జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ ప్రతీ వర్షపునీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటిపారుదలశాఖ పనితీరుపై సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వకూడదని అన్నారు. నీటి వనరుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని చిన్నతరహా నీటిపారుదల చెరువుకట్టల పటిష్టతను పరిశీలించాలని, తూములు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మరమ్మతు గుర్తించి, వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
టాస్క్ సెంటర్ సందర్శన
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని టాస్క్ సెంటర్ను గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. శిక్షణ తీరుపై టాస్క్సెంటర్ ఇన్చార్జి కౌసల్య, ఉపాధికల్పనాధికారి రాజశేఖర్లను అడిగి పలు సూచనలు ఇచ్చారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచేలా ఉచిత శిక్షణ ఇస్తున్న టాస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త బ్యాచ్లలో చేరే వారు ఈనెల 8నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కాలేజీ భవన పనుల పరిశీలన
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సాగుతున్న భవన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పనులు నాణ్యతగా జరగాలన్నారు. సంబంధిత అధికారులు నిరంతరం పనులు జరిగేలా ఆదేశించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


