ఐదు రోజుల్లో రూ.14.78 కోట్ల ఆదాయం 27.39 లక్షల మంది ప్రయాణం అందులో 19.55 లక్షల మంది మహిళలే ఒక్క రాఖీ రోజే ఖజానాకు రూ.3.60 కోట్లు
ప్రణాళికతో పనిచేశాం
కరీంనగర్: రక్షాబంధన్ టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో ఆగస్టు 27 నుంచి 31 వరకు 4,940 బస్సులు నడిపారు. ఇవి 21.40 లక్షల కిలోమీటర్లు తిరిగి ఏకంగా 27.39 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీరిలో 19.55 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రవాణా ద్వారా రూ.14.78 కోట్ల ఆదాయం సమకూరింది.
● మహిళల ప్రయాణానికే రూ.8.50 కోట్ల విలువ
మహాలక్ష్మి పథకంతో మహిళల రాకపోకలు భారీగా పెరిగాయి. జీరో టికెట్ల విలువ రూ.8.50 కోట్లుగా నమోదైంది. సాధారణ టికెట్ల ద్వారా వచ్చిన వసూళ్లతో కలిపి సంస్థకు గణనీయమైన ఆదాయం లభించింది. ఐదు రోజుల వ్యవధిలో సగటున రోజుకు రూ.2.95 కోట్ల ఆదాయం సమకూరగా, దాదాపు 5.47 లక్షల మంది రోజువారీగా ప్రయాణించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
● రాఖీ రోజే రూ.3.60 కోట్లు...
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న 988 బస్సులు అదనంగా నడపగా, 6.38 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఇందులో 4.73 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆర్టీసికి రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది. జీరో టికెట్ల రూపంలోనే రూ.2.20 కోట్ల విలువైన ప్రయాణం నమోదైంది.
● ఆదాయంలో కరీంనగర్–2 డిపో అగ్రస్థానం
కరీంనగర్–2 డిపో రూ.2.24 కోట్లతో ఆదాయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గోదావరిఖని రూ.2.05 కోట్లు, జగిత్యాల రూ.1.65 కోట్లు ఆర్జించి తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్–1 డిపో రూ.1.58 కోట్లు, హుస్నాబాద్ రూ.1.71 కోట్లు, హుజూరాబాద్ రూ.1.20 కోట్లు, కోరుట్ల రూ.1.06 కోట్లు, మెట్పల్లి రూ.0.97 కోట్లు, సిరిసిల్ల రూ.1.03 కోట్లు, వేములవాడ రూ.1.08 కోట్లు, మంథని రూ.0.86 కోట్ల వసూళ్లు సాధించాయి.
● ప్రయాణికుల సంఖ్యలో గోదావరిఖని ముందంజ
గోదావరిఖని డిపో 3.89 లక్షలమందిని గమ్యస్థాలకు చేర్చి మొదటిస్థానంలో నిలిచింది. జగిత్యాల 3.37 లక్షలు, కరీంనగర్–1 డిపో బస్సుల్లో 3.16 లక్షల మంది ప్రయాణించారు. కరీంనగర్–2 డిపో బస్సుల్లో 2.85 లక్షలు, హుజూరాబాద్ 2.55 లక్షలు, హుస్నాబాద్ 2.19 లక్షలు, మెట్పల్లి 2.01 లక్షలు, కోరుట్ల 2.01 లక్షలు, వేములవాడ 2.07 లక్షలు, సిరిసిల్ల 1.89 లక్షలు, మంథని డిపో బస్సులు 1.32లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.
ఆగస్టు 27 నుంచి 31 వరకు వచ్చిన ఆదాయం
డిపో ఆదాయం ప్రయాణికులు
(రూ.కోట్లలో) (లక్షల్లో)
కరీంనగర్–1 1.58 3.16
కరీంనగర్–2 2.24 2.85
గోదావరిఖని 2.05 3.89
హుస్నాబాద్ 1.71 2.19
హుజూరాబాద్ 1.20 2.55
జగిత్యాల 1.65 3.37
కోరుట్ల 1.06 2.07
మంథని 0.86 1.32
మెట్పల్లి 0.97 2.01
సిరిసిల్ల 1.03 1.89
వేములవాడ 1.08 2.07
పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ సర్వీసులతో పాటు అదనపు బస్సులు నడిపించాం. ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి సర్వీసులు నడిపించాం. దీంతో మహిళలు, సాధారణ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరుకోగలిగారు. రాఖీ పండగ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల రవాణా వ్యవస్థ సజావుగా సాగింది.
– రాజు, రీజినల్ మేనేజర్, కరీంనగర్


