పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంతోపాటు వివిధమండలాలు, గ్రామాల్లోనూ మినరల్ వాటర్ పేరిట నీళ్లదందా యథేచ్ఛగా సాగుతోంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండానే పుట్టగొడుగుల్లా ప్లాంట్లు వెలుస్తున్నాయి. యజమానులు అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు. పెద్దపల్లిలో మొన్నటివరకు 20లీటర్ల క్యాన్కు రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు.. ఇప్పుడు రూ.15కు పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
బోరునీటినే శుద్ధి చేస్తూ..
ఇంటి ఆవరణలోని బోరుబావి నీటినే మినరల్ వాటర్ పేరిట క్యాన్లలో నింపి విక్రయిస్తున్నారు. కిరాణాలతోపాటు గల్లీకి కనీసం మూడు నుంచి నాలుగేసి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటికి మున్సిపల్, గ్రామ పంచాయతీ అనుమతి ఉండడంలేదు. ఒక్కపెద్దపల్లిలోనే దాదాపు 200 వరకు వాటర్ప్లాంట్లు ఉన్నాయి. ప్రతీ మండల కేంద్రంలో 10 నుచి 15 వరకు, పల్లెల్లో ఐదు నుంచి 10 వరకు వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
క్యాన్లలో నింపి.. ఆటోల్లో సరఫరా
బోరుబావి నీటిని క్యాన్లలో నింపిన యజమానులు.. అధికారుల నుంచి అనుమతి పొందిన కంపెనీ పేరిట ముద్రించిన క్యాన్లనే వినియోగించాలి. కానీ ఎక్క కూడా క్యాన్లపై ప్లాంటు పేరు, చిరునామా, సెల్ నంబర్ కనిపించడం లేదు. బోరుబావి, కనిపించేలా ప్లాంటు ఉంటేచాలు.. నీళ్ల దందా సాగిస్తూ కూర్చున్నచోటే అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చనే భావనతోనే చాలామంది వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
తనిఖీలు ఏవీ?
అనుమతి లేకుండానే మినరల్ వాటర్ పేరిట నీళ్లదందా బహిరంగంగా సాగుతున్నా అఽధికారయంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాటర్ క్యాన్లను సరఫరా చేసే ఆటోలు సైతం కాలం చెల్లినవేనని, ఆర్టీవో అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.


