దారులన్నీ మేడారం వైపే..
మంథని: మహారాష్ట్రతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంథని మీదుగా వందలాది వాహనాలు మేడారం తరలివెళ్తున్నాయి. పెద్దపల్లి–కాటారం – గోదావరిఖని మధ్య రోడ్డు మరమ్మతు, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగైంది. మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపజేస్తుండడంతో చాలామంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు.
ప్రమాదకరంగా మూలమలుపులు..
పెద్దపల్లి–కాటారం–గోదావరిఖని మధ్య అనేక ప్రమాదకర మూలమలుపులు, ఇరుకు వంతెనలు, కల్వర్టులు ఉన్నాయి. గత జాతర వేళ మంథని మండలం ఎక్లాస్పూర్ మూలములుపు వద్ద మేడారం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. కాటారం – గోదావరిఖని మధ్య కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం కేశవాపూర్ మూలమలుపు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. మూలమలుపుల వద్ద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాల్సి ఉంది.


