పెరుగుతున్న హాజరుశాతం
సర్కారు బడుల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు రెండు పూటలా ప్రత్యేక యాప్లో హాజరు నమోదు సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు ముందుకు సాగుతున్న టీచర్లు, విద్యార్థులు
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. విద్యార్ధులు, ఉపాధ్యాయుల బోగస్ హాజరుకు చెక్ పెట్టేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫేస్ రికగ్నిషన్ బేస్ట్ అటెన్డెన్స్ యాప్ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీరోజు విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ హాజరును ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు. గతంలో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు సమయపాలన పాటించేవారు కాదనే ఆరోపణలు ఉండేవి. ఈ యాప్ అమలులోకి వచ్చిన తర్వాత ఠంచన్గా పాఠశాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో..
జిల్లాలోని 13మండలాల్లో గల 834 ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారు. ప్రతీరోజు ప్రార్థన తర్వాత క్లాస్రూంలోకి వెళ్లే ముందు ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. అలాగే సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మళ్లీ హాజరు నమోదు చేస్తారు. దీంతో ప్రతీ రోజు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సాంకేతిక సమస్యలతో..
ఎఫ్ఆర్ఎస్ నమోదులో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్, సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడంతో ఒక్కోసారి విద్యార్థి హాజరైనా ఆన్లైన్లో గైర్హాజర్ అయినట్లు నమోదు అవుతుందని చెబుతున్నారు. అలాగే ప్రతీరోజు క్లాస్కు వెళ్లే సమయంలో ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయడంతో సుమారు అర్ధగంట సమయం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
మిడ్డే మీల్స్లో అక్రమాలకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ ఎఫ్ఆర్ఎస్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ప్రతీరోజు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారనే నివేదిక ఆధారంగా వంట తయారు చేస్తారు. గతంలో క్లాస్లో ఉన్నవిద్యార్థుల సంఖ్య ఆధారంగా వంట చేయడంలో అక్రమాలకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎఫ్ఆర్ఎస్తో అలాంటి అక్రమాలకు తావు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


