జిల్లాలో..
సాక్షి, పెద్దపల్లి: చదువు నేర్చుకోవాలంటే కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి కొందరు విద్యార్థులది. కొన్ని మార్గాల్లో సర్వీసులు లేకపోవడం, కొన్నింటిని రద్దు చేయడంతో విద్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఆర్థిక భారమవుతోందని నడుచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా మండల, జిల్లా కేంద్రాలకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పక్క గ్రామాలకై తే నడుచుకుంటూ వెళ్తుండగా, మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఆదాయం లేదన్న సాకుతో..
జిల్లాలోని మంథని, గోఆవరిఖని డిపోల పరిధిలో 113 ఆర్టీసీ, 60 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం కిలోమీటరుకు(ఈపీకే) రూ.25 ఆదాయం వచ్చే రూట్లలో మాత్రమే ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. విద్యార్థులు అధికంగా వస్తున్న గ్రామాల మార్గాల్లో కిలోమీటరుకు (ఈపీకే) రూ.15 నుంచి రూ.18 వరకే ఆదాయం వస్తోంది. ఆదాయం లేని చోట బస్సులను తిప్పితే సంస్థ నష్టాల్లో వెళ్లే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు అద్దె బస్సులను గతంలో గ్రామాలకు తిప్పేది. ప్రస్తుతం వాటిని లాభాలు ఉన్న రూట్లల్లోనే పంపుతున్నారు. కొన్ని చోట్ల నడుస్తున్నప్పటికీ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయాల్లో కాకుండా ఇతర వేళల్లో తిప్పుతున్నారు.
ప్రైవేట్ వాహనాల జోరు
ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రయాణికులు ఆటోలు, జీపులు ఆశ్రయిస్తున్నారు. వారు ఇష్టమెచ్చినట్లు చార్జీలు వసూలు చేస్తున్నారు. పరిమితికి మించి ఎక్కించుకుని వెళ్తుండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు భయపడుతున్నారు.
జిల్లాలోని డిపోల పరిధిలో బస్సుల వివరాలు
డిపోలు గోదావరిఖని మంథని
మొత్తం బస్సులు 123 50
ఆర్టీసీవి 83 30
అద్దె బస్సులు 40 20
రోజూ తిరిగే కి.మీ 52,377 21,500
గమ్యస్థానం చేరేవారు 73,500 17,000
రోజువారీ ఆదాయం రూ.32 లక్షలు రూ.12లక్షలు
బస్సుసౌకర్యంలేని గ్రామాలు 29 12


