● ఈ నెల 28న 263 స్కూళ్లలో సర్వే
విజయనగరం అర్బన్: పట్టణంలోని పీఎస్ఆర్ పాఠశాలలో స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ఎల్ఏఎస్–2026) నిర్వహణపై విద్యాశాఖ అధికారులకు, సిబ్బందికి చేపట్టిన అవగాహన సదస్సు మంగళవారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సాల్ట్’(సపోర్టింగ్ ఆంద్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్) ప్రాజెక్ట్లో భాగంగా ఈ నెల 28న జిల్లాలోని 263 పాఠశాలల్లో మూడో దశ ఎస్ఎల్ఏఎస్ సర్వే నిర్వహిస్తున్న తెలిపారు. సదస్సులో ఆర్జేడీ బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. 5, 7, 9వ తరగతుల విద్యార్థుల తరగతి స్థాయి అభ్యసన సామర్థ్యాలు, లోపాలు, కీలక నైపుణ్యాలను అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఇది వ్యక్తిగత పాఠశాలలు లేదా ఉపాధ్యాయుల మూల్యాంకనం కోసం కాకుండా విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు దోహదపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సర్వేలో గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులపై ద్విభాషా (తెలుగు–ఇంగ్లిష్) విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతీ విద్యార్థి నిర్దేశిత కలయిక ప్రకారం ఏవైనా రెండు అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. మాస్టర్ ట్రైనర్లు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు ఓఎంఆర్ షీట్ల పూరణ, ప్రశ్నపత్రాల భద్రత, విద్యార్థుల ఎంపిక, గోప్యత, ప్యాకింగ్ మరియు హాజరు నమోదు అంశాలపై పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఈబీ క్యాదర్శి టి.సన్యాసిరాజు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు.


