గుమ్మలక్ష్మీపురం: మండలంలోని భద్రగిరి సామాజిక ప్రభుత్వాస్పత్రి నూతన భవనం ప్రారభించి 20 రోజులు గడుస్తున్నా రోగులకు అవస్థలు తప్పడం లేదు. పాత భవనంలో చాలీచాలని బెడ్లపై రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. పనులు పూర్తికాకుండా ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు కానుక అంటూ.. కురుపాం ఎమ్మెల్యే అధ్యక్షతన జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు భవనాన్ని ప్రారంభించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పాత ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఫ్యాన్లు లేకపోవడంతో.. ఉక్కబోత, దోమల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు ఇన్పేషెంట్లు ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వినియోగించుకుంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోగులకు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.


