ఎండుతున్న నేల..
● ఆకాశం వైపు రైతు చూపు.. ● ఖరీఫ్పై చేతులెత్తేసిన అన్నదాతలు
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్:
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుకు మబ్బులే తప్ప చినుకుజాడ కనిపించడం లేదు. పొలంలో పచ్చదనం కరువైంది. చేసిన కొద్దిపాటి సాగును కాపాడుకోవడానికి నీరు లేదు. పార్వతీపురం మ న్యం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగుపై రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 72,829 హెక్టార్లు కాగా.. ప్రస్తుతానికి 50 వేల హెక్టార్లలోనే వరినాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ సాగు ఊపందుకోవాల్సి ఉండగా.. వర్షాల జాడ లేక పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. వానలు పడతాయనే ఆశతో కొందరు రైతులు నారుమడులు వేసి, కొద్దిపాటి సాగు ప్రారంభించారు. ఆ తర్వాత కూడా సరైన వర్షాలు కురవకపోవడంతో నారు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తోంది. అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన అన్నదాతలు ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి వస్తుందా అన్న ఆందోళనలో ఉన్నారు. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారం వరకూ జిల్లాలో నాట్లుకు అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
అడపాదడపా వర్షం..
సాగుకు మాత్రం సరిపోని నీరు
జిల్లాలో అక్కడక్కడా అడపాదడపా జల్లులు పడినా అవి సాగుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని రైతులు వాపోతున్నారు. భూమిలో తేమ నిలిచేంతగా వర్షపాతం లేకపోవడంతో విత్తనాలు వేయడానికి కూడా రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు నీరందించే పరిస్థితి లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 50 శాతం వరకూ లోటు వర్షపాతం ఉంది. జూన్లో 41 మి.మీ., జూలైలో 55, ఆగస్టులో 41 మి.మీ వరకూ లోటు వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అంతంతే..
వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోనూ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. జిల్లాలో ప్రధాన జలాశయాలు అయిన వెంగళరాయ, పెదంకలాం, పెద్దగెడ్డ, వట్టిగెడ్డలో నీటి నిల్వలు పడిపోయాయి. మొత్తం ప్రాజె క్టు నీటి సామర్థ్యంలో సగమైనా నిల్వలు లేకపోవ డం గమనార్హం. సాధారణంగా వర్షాకాలంలో నిండాల్సిన జలాశయాలు ఇప్పటికీ నీటికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీంతో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వర్షం రాకపోతే ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేసి పంటలను కాపాడుకునే అవకాశం కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ చిత్రంలో ముదురుతున్న వరి
నారుమళ్లను చూశారా... ఇవి పాలకొండ
మండలం రుద్రిపేట గ్రామ సమీపంలోనివి. వరి సాగుకు అనుకూలమైన ఆశ్లేష కార్తె ముగిసింది. మగకార్తె వచ్చి పదిరోజులు గడిచినా తోటపల్లి నుంచి చుక్కనీరు కూడా పొలాలకు చేరలేదు. వర్షాలు కూడా
అనుకూలించడం లేదు. వరినారు ముదిరిపోతుండడం, ఉభాలు జరగకపోవడంతో దిగుబడు లు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుపై ఆశలు వదులుకుంటున్నారు.


