దళితుల భూములపై..
విజయనగరం గంటస్తంభం: నిరుపేద దళితులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ (ఎల్సీసీ) భూమిని అడ్డగోలుగా ఆక్రమించి, నిబంధనలను కాలరాస్తూ దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్న తీరు విజయనగనరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డీఓ కోర్టు వివాదంలో ఉన్న భూమి అని తెలిసినా, సాక్షాత్తూ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేత అండదండలు ఉండడంతో అధికారులు కిక్కురుమనకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పచ్చ నేతల రియల్ దందా..
విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని గాజులరేగలో (బీటీఆర్ కాలనీ సమీపంలో) గల సర్వే నంబర్లు 82–3 (0.90 ఎకరాలు), 82–4 (0.85 ఎకరాలు), 82–5 (0.65 ఎకరాలు)లలో మొత్తం 2.40 ఎకరాల భూమిని 1982లో అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు వ్యవసాయం చేసుకునేందుకు ల్యాండ్ సీలింగ్ (ఎల్సీసీ) కింద కేటాయించింది. ప్రభుత్వ రికార్డుల్లోనూ ఈ భూములు సీలింగ్ భూములు–ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో స్థానిక టీడీపీ పెత్తందారులు, నాయకుల కన్ను ఈ స్థలంపై పడింది. దళిత లబ్ధిదారులను బెదిరించి, మోసగించి ఆ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు.
విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని గాజులరేగలో
యథేచ్ఛగా భూ ఆక్రమణలు
82లో 3, 4, 5 సర్వే నంబర్లలోని 2.40 ఎకరాల ఎల్సీసీ
భూమి స్వాహా
గతంలో పీఓటీ నోటీసులు ఇచ్చినా ఆగని కబ్జాల పర్వం
అక్రమార్కులకు అండగా అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేత
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం


