పాలకొండ రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏరియా ఆస్పత్రిలో శనివారం రాత్రి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన అవనాపు కిశోర్ అలియాస్ రమణ పాలకొండలోని పెద్దకాపు వీధిలో తన బంధువుల ఇంటికి వచ్చాడు. తన వ్యక్తిగత సమస్యల కారణంగా చేతిపై కోసుకున్నాడు. ఇంటి వద్ద అతి చేయడంతో కుటుంబీకులు వందకు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సాయంతో తొలిత పాలకొండ ఏరియా ఆస్రపత్రికి కిశోర్ను తరలించారు. ఆస్పత్రిలో కిశోర్ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడంతో పాటు వైద్యం అందించే క్రమంలో వైద్యులను దుర్భాషలాడాడు. సమీపంలో ఉన్న ఆస్పత్రి అద్దాలను విరగ్గొట్టాడు. సిబ్బంది, వైద్యులపై తిరిగబడి హల్చల్ చేయడంతో అక్కడి వారు హడలిపోయారు. దీంతో సూపరింటెండెంట్ కె.చిరంజీవి, ఆస్పత్రి వర్గాలు అందించిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. నిందితుడు మద్యం లేక గంజాయి మత్తులో ఉండొచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఏరియా ఆస్పత్రిలో వీరంగం


