● ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్ఓ
పార్వతీపురం రూరల్ : సరైన వయసులో వివాహం, కాన్పుల మధ్య నిర్దిష్ట వ్యవధి పాటించడంతో ఆరోగ్యకర కుటుంబాలను నిర్మించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సిబ్బందితో కలిసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. తల్లీబిడ్డల క్షేమం కోసం గర్భధారణల మధ్య విరామం అత్యవసరమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా లభించే ఐయూసీడీ, కాపర్–టీ, అంతర ఇంజెక్షన్లు, ఓరల్ పిల్స్, కండోమ్స్ వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాన్పుల మధ్య ఎడం వల్ల బాలింతల్లో రక్తహీనత, హైరిస్క్ సమస్యలు తలెత్తవన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొగ్రాం అధికారులు డా.వై.విజయ్మోహన్, డా.జగన్ మోహనరావు, డా.రవికుమార్ రెడ్డి, సూర్యనారాయణ, నగేష్ రెడ్డి, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జి.కిషోర్, డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీహెచ్ఎన్ఓ ఇన్చార్జి విజయలక్ష్మి పాల్గొన్నారు.


