● డేటా సేకరణలో కచ్చితత్వం తప్పనిసరి
● బందలుప్పిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీఓ మాధురి
పార్వతీపురం రూరల్ : ప్రత్యేక సమాచార సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఆర్డీఓ మాధురి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండల పరిధిలోని బందలుప్పి గ్రామంలో క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 99, 100, 101 నంబరు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను స్థానిక తహసీల్దార్తో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), ఇతర క్షేత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి ప్రగతిని సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో సేకరించే సమాచారం, వెరిఫికేషన్ ప్రక్రియలో ఎక్కడా తప్పులు దొర్లకుండా నూరు శాతం కచ్చితత్వం పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అధికారిక నియమ నిబంధనలను విధిగా పాటిస్తూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. పనులన్నీ కేటాయించిన సమయంలోగా పూర్తి కావాలని ఆదేశించారు.


