● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ఇంజినీర్ల వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమన్వయంతోనే క్షేత్ర స్థాయిలో మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న జలధార పనులను జూలై 10వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలకు గురికాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ఇంజనీర్లేదేనన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నందున రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి మండలంలో ప్రజల సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతులను, సాగునీటి సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఖరీఫ్కు సాగునీటిని సక్రమంగా ఆయకట్టు శివారు వరకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేటర్ల ఆధారంగా ఇరిగేషన్ స్టార్టింగ్ పాయింట్లను మ్యాప్ చేసుకోవచ్చునని, తద్వారా సమస్యలను ఒక క్లిక్తో విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ డిఎస్.ప్రదీప్తో పాటు వివిధ మండలాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


