విజయనగరం ఫోర్ట్: ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరంలోని దాసన్నపేటలో సోమవారం జరిగింది. సంఘ రీజనల్ కార్యదర్శిగా సురగాల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా అధ్యక్షుడిగా గేదెల రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుమ్మడి దేముడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రామునాయుడు, సెక్రటరీగా డి.శ్రీనివాస్కుమార్, కోశాధికారిగా బి.కూర్మారావు, ఉపాధ్యక్షులుగా బి.రమణమూర్తి, జి.చంద్రరావు, జె.రాజబాబు, కె.ప్రసాదరావు, ఎ.రవి, ఎస్.నాగరాజు, మహిళా ఉద్యోగుల ప్రతినిధిగా బాలకుమారి ఎంపికయ్యారు.
పేకాట శిబిరంపై దాడి
రామభద్రపురం: మండలంలోని చందాపురం గిరిజన గ్రామం శివారులో సోమవారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు జూదరులను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో కోత ముక్కల పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.11,500లు నగదు,ఆరు సెల్ఫోన్లు,మూడు బైక్లు,ఒక ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదుచేశారు.
పెంచిన ‘పెట్రో’
ధరలు తగ్గించాలి
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎంలు పోరుబాట పట్టాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేత బుగత అశోక్, రామకృష్ణనగర్లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు రెడ్డి శంకరరావు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ పదేపదే పెంచుతున్నా ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి అయిన రాష్ట్రంలోని కూటమి సర్కారు నోరు మెదపడం లేదని విమర్శించారు. పెంచిన పెట్రో ధరలతో పాటు పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూన్ 9న వామపక్షాలు చేపట్టే దేశవ్యాప్త నిరసనలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు.
– విజయనగరం గంటస్తంభం


