● భయాందోళనలో రైతులు
సాలూరు రూరల్: మండలంలోని మావుడి పంచాయతీ పురిగానివలస సమీప గ్రామాల పంటపొలాల్లో ఏనుగులు బస చేస్తూ గడిచిన మూడు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు రైతులు మరోవైపు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను తరిమేందుకు కసరత్తు చేస్తున్నప్పటికి అవి అక్కడే పంట పొలాలను ధ్వంసం చేస్తూ పక్కనే ఉన్న గొలుసుల మెట్ట రిజర్వాయర్లో నీళ్లు తాగుతూ జీడి తోటలో బస చేస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పెద్దవలస సమీప కొండలపైకి ఏనుగులను తరిమివేసినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామస్తుడు కె.రాజాకు సంబంధించిన చెరుకు తోటను ఏనుగులు శనివారం ధ్వంసం చేశాయి. అలాగే పక్కనే ఉన్న రైతుల అరటి తోటలను నాశనం చేశాయి. మూడురోజులుగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పంటనష్టాలు ఇస్తారా?
ఏనుగుల కారణంగా రైతులకు జరిగిన పంటనష్టాలు ప్రభుత్వం ఇస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పంట నష్టాలు అంచనా వేసేందుకు ఒక్క అధికారి కూడా రాలేదని వాపోతున్నారు. ఇలాగే ఏనుగులు పంటలు నష్టపరిస్తే రైతుల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.


