పార్వతీపురం: ఉపాధ్యాయులు రొటీన్ బోధనకు స్వస్తి చెప్పి, ప్రణాళిక యుత బోధనకు ప్రాధాన్యమివ్వాలని, దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. వృత్తిని ప్రేమించి స్వయం తృప్తి కోసం పనిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు చెట్లు నాటడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను బోధించాలని సూచించారు. విద్యాసంవత్సరం తొలి మూడు నెలలు ఆటలు, పాటలు, నృత్యాలతో బోధన నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు అరగంట ముందుగానే హాజరై శుభ్రతను పర్యవేక్షించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఏపీఓ వై.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.


