విజయనగరం: విజయనగరాన్ని సంపూర్ణ పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి.బాలస్వామి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక వసంత విహార్లోని బహుళ నివాస సముదాయాల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శనివారం తొలగించారు. కమిషనరే స్వయంగా చెత్తను ఎత్తి ట్రాక్టరులో పోసి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజారోగ్యం, స్వచ్ఛ విజయనగరమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా రోజూ ఉదయం ఇంటి వద్దకు వస్తున్న పారిశుధ్య సిబ్బందికి చెత్తను అందించాలని చెప్పారు. నెల రోజుల పాటు ఎల్లో, రెడ్ స్పాట్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ వారం బహుళ నివాస, వాణిజ్య సముదాయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టామని, వచ్చేవారం సామాజిక మరుగుదొడ్ల పరిశుభ్రత చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.


