విధులకు హాజరైన వైద్యురాలు | - | Sakshi
Sakshi News home page

విధులకు హాజరైన వైద్యురాలు

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

విధులకు హాజరైన వైద్యురాలు ప్రిన్సిపాల్‌కు డాక్టరేట్‌ పార్వతీపురం ఆర్డీఓగా మాధురి గడువులోగా పనులు పూర్తిచేయాలి ● వీసీలో అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

పాలకొండ రూరల్‌: స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో రెగ్యులర్‌ వైద్యులు లేక రోగులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో ప్రచురితమైన కథనం మేరకు సీతంపేట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి స్పందించారు. ఈ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించిన ఆమె ప్రత్యామ్నాయ పద్ధతిలో ప్రస్తుతం మండలంలోని అన్నవరం పీహెచ్‌సీ వైద్యురాలిని సేవలందించాలని సూచించారు. ఈ క్రమంలో గురువారం వైద్యురాలు బి.అంకిత అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో సేవలు ప్రారంభించడంతో రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత వేసవిలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

పాలకొండ రూరల్‌: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వేమూరి హరగోపాల్‌ను డాక్టరేట్‌ వరించింది. 2002లో భౌతిక శాస్త్ర ఆధ్యాపకుడిగా విధుల్లో చేరిన ఆయన తాను ఎంచుకున్న రంగంలో అనేక పరి శోధనలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫెరో మాగ్నెటిక్‌ నానోస్ట్రక్చర్స్‌లో యాంటీడాట్‌ల సహాయంతో 360 డిగ్రీల డెమెయిన్‌ వాల్‌ల ఏర్పాటు, వాటి కదలికలు–స్పింట్రానిక్‌ మెమరీ లాజిక్‌ పరికరాలపై చేపట్టిన అధ్యయనానికి డాక్టరేట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ గీతం యూనివర్సిటీ క్యాంపస్‌ గైడ్‌ డాక్టర్‌ విజయనందిని కన్నన్‌ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం గురువారం హర్షం వ్యక్తం చేసింది.

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా 2023 బ్యాచ్‌కు చెందిన పీడీసీ కె.మాధురి నియమితులయ్యా రు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు కేటాయిస్తూ గురు వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మాధురిని పార్వతీపురం ఆర్డీఓగా నియమించారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొంది న డి.ధర్మరాజును జిల్లాలోని కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ గా నియమించారు. ఇది వరకూ ఇక్కడ పని చేసిన డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. తదుపరి పోస్టింగ్‌ కో సం ఆయన జీఏడీకి నివేదించాల్సి ఉంటుంది.

పార్వతీపురం: నీతి అయోగ్‌ ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం (ఏడీపీ), ఆస్పిరేషనల్‌ బ్లాక్స్‌ ప్రోగ్రాం (ఏబీపీ) కింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లాను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భామిని మండలంలోని తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల పనుల పురోగతిని పరిశీలించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం సహించబోమన్నారు.

బస్సు షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో జిల్లాలో నిర్మిస్తున్న బస్సుషెల్టర్లు, సామాజిక భవనాలు, రచ్చబండలు, గ్రావెల్‌ రోడ్ల పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 10లోగా పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని, కొత్త బస్సుషెల్టర్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలు, సుందరీకరణ, మొక్కలు నాటాలని ఆదేశించారు.

ఆస్పత్రులు సిద్ధం కావాలి

గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న భద్రగిరి, కురుపాం ఆస్పత్రులను ఈనెల 15 లోగా పూర్తి చేయాల ని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సాలూరు ఏరియా ఆస్పత్రి ప్రహ రీ, ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, చినమేరంగి, పాలకొండ, సీతంపేట, మల్టీస్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement