జియ్యమ్మవలస రూరల్: మండలాభివృద్ధి అధికారి కార్యాలయంలో సుమారు 10 లక్షల నిధులను ఎంపీడీవో హనుమంతు శశిభూణరావు, ఏఓ రామారా వు, సీనియర్ అసిస్టెంట్ ఎం.వి.డి.ప్రసాద్, ఆఫీస్ సబార్డినేటర్ శ్రీనివాసరావు కలిసి అక్రమంగా డ్రాచేసి కాజేశారని ఎంపీపీ బొంగు సురేష్ జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వివిధ ఖాతాల నుంచి ఎటువంటి నోట్ ఫైల్స్ లేకుండా సొంతగా ఓఎస్ శ్రీనివాసరావు పేరుతో నిధులు విత్ డ్రాచేసి సొంతానికి వాడుకున్నాడని ఎంపీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కురు పాం ఎస్బీఐ బ్యాంకులోని కరెంట్ ఖాతా నుంచి గత నెల 5వ తేదీన రూ.50వేలు, అదే బ్రాంచిలో ఉన్న సేవింగ్ ఖాతా నుంచి గతనెల 15 తేదీన రూ. 1,62,770లు, గతనెల 16వ తేదీన రూ.1,77,770, 21వ తేదీన రూ. 4,77,777లు ఇలా మొత్తం రూ. 9,18,317ల ప్రజాధనాన్ని డ్రాచేసి సొంతానికి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనులు, రికవరీలు, ట్రైనింగ్, ఇతర కార్యక్రమాల నిర్వహణకు జెడ్పీ నుంచి మంజూరైన అభివృద్ధి పనుల డిపాజిట్లు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు, సీజీఎస్టీ, జీఎస్టీ ఇలాంటి పలు రకాలైన నిధులను ఎంపీపీ అనుమతి లేకుండా డ్రాచేసి దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఎంపీడీఓ శశిభూషణరావు కార్యాలయ పనివేళల్లో మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని, పై అధికారులను కూడా లెక్కచేయకుండా వికృత చేష్టలు చేసి తోటి ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నా రు. ఫిర్యాదు అంశాన్ని సంబంధిత సీఈఓ (విజయనగరం)కు తెలియజేశామని, ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ తిరుపతి, ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకుని రెండు నెలలే అయ్యింది. ఇటీవల రూ.50వేల చెక్కు డ్రా చేసి ఆఫీ సు, ఇతర మెయింట్నెన్స్కు ఖర్చుచేశాం. తనకు మద్యం సేవించే మానసిక బలహీనత ఉంది. ఆ పరిస్థితుల్లో చెక్కులపై ఆఫీస్ సబార్టనేట్ శ్రీనివాసరావు సంతకాలు చేయించి ఆ నిధులను వారే డ్రా చేశారేమో తనకు తెలియదు. ప్రస్తుతం అనారోగ్య స్థితిలో ఉన్నాను. చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశానుసారం జియ్యమ్మవలస ఎంపీడీఓగా వచ్చాను. ఎంపీపీ బొంగు సురేష్ ఏం చేస్తారో చేసుకోమనండి. తనపై రూ.10 లక్షలు డ్రా చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ప్రైవేట్గా పరువు నష్టం కేసు వేస్తాను. రెండు సంవత్సరాలుగా జీతం లేక అవస్థలు పడుతున్నాను. అవసరమైతే తనకు రావాల్సిన జీతభత్యాలు నుంచి చెల్లిస్తాను. – హెచ్. శశిభూషణరావు, ఎంపీడీఓ


