పాలకొండ రూరల్/సీతంపేట: జిల్లాలో ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులకు కొదవ లేదని పార్వతీపురం మన్యం జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రామినాయుడు అన్నారు. ఈ మేరకు సీతంపేటలోని ఐటీడీఏ క్రీడా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా జట్టు ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12 నుంచి మూడు రోజులు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్న జట్టును సిద్ధం చేశామన్నారు. శిక్షకులు సవర రాజేష్, అసోసియేషన్ కోశాఽధికారి అల్లు సురేష్ నేతృత్వంలో చేపట్టిన ఎంపిక పోటీల్లో సీతంపేట, పాలకొండ, భామిని, పార్వతీపురం మండలాల నుంచి తలపడ్డ 28 మంది సీనియర్ క్రీడాకారుల నుంచి 18 మందిని ఎంపిక చేశామన్నారు. వారికి మరింత తర్ఫీదు అందించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో జిల్లా సత్తా చాటేలా కృషి చేస్తామన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా అసోసియేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


