● అవయవ దానం చేసిన జూనియర్ లైన్మన్
● కుటుంబసభ్యులను అభినందించిన వైద్యులు,ట్రాన్స్కో అధికారులు
వీరఘట్టం: విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ పనులు చేస్తూ ఆదివారం విద్యుత్స్తంభంపైనుంచి ప్రమాదవశాత్తు జారిపడిన వీరఘట్టం మండలం తెట్టంగి జూనియర్ లైన్మన్ సవర సోమేశ్వరరావు(31) బ్రెయిన్ డెడ్ అయిన విషయం విదితమే. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో బుధవారం శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో గుండె, కిడ్నీలు,కార్నియాను జీవన్దాన్ బృందం స్వీకరించింది. స్వీకరించిన అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో విశాఖపట్నం తరలించారు. జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్టును అనుసరించి అవయవాలను వివిధ ఆస్పత్రులకు కేటాయించారు. అవయవదానం అనంతరం సోమేశ్వరరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద సోమేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని సోమేశ్వరరావు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో అధికారులు, స్థానిక ప్రజలు మృతుడి కుటుంబసభ్యులను అభినందించారు. అవయవదానం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం చాకలిగూడకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో పనిచేస్తున్న గ్రామం తెట్టంగి, స్వగ్రామం చాకలిగూడలో విషాదచాయలు అలముకున్నాయి.


