న్యూస్రీల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
● వన్ధన్ కేంద్రాలు.. అధికారులకే వం‘ధనం’
● నిరుపయోగంగా పప్పులు, చిరుధాన్యాల యూనిట్లు
● గిరి ‘వెలుగంతా’ అవినీతి చీకటే..
లక్షల
ఖర్చు..
సాక్షి, పార్వతీపురం మన్యం : గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఏర్పడిన వన్ధన్ వికాస కేంద్రాలు(వీడీవీకే).. అధికారులకే వం‘ధనం’ అయ్యాయి. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటీడీఏలో ఉన్న గిరి వెలుగంతా అవినీతిమయమైంది. శిక్షణలు, అడ్వాన్సులు, కొనుగోలు, విక్రయాలు, ఇతర కార్యకలాపాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీడీవీకేలకు ఇచ్చిన నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. వీటిపై న్యాయబద్ధంగా జరగాల్సిన విచారణ సైతం.. వాస్తవాలను మరుగనపర్చింది. నివేదికలను తుంగలో తొక్కి, ‘మమ’ అనిపించేశారు. లక్ష్యం లేకుండా నిధులను వినియోగించినట్టు తేల్చినా.. అప్పటి ఏపీడీపై చర్యలు లేవు. ఫలితంగా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.లక్షల నిధులు దుర్వినియోగమైన పరిస్థితి ఏర్పడింది.
ఆ మాత్రం తెలీదనుకోవాలా?
యంత్రాలనైతే హడావిడిగా కొనుగోలు చేశారుగానీ.. వీటి ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం షెడ్లు ఏర్పాటు చేయలేదు. యంత్రాలు పని చేయాలంటే.. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలి. ఇప్పుడు కరెంటు సమస్య వల్ల వినియోగించలేదని చెప్పుకొస్తున్నారు. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా యంత్రాలు కొనుగోలు చేసేశారా? పోనీ, తర్వాతైనే ఏర్పాటు చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిరుపయోగంగా వదిలేసిన అధికారులు.. ఇప్పుడేమో వాటిని ఆసక్తి గల వ్యక్తులొస్తే వారికి కేటాయించి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పడం కొసమెరుపు.
చింతపండు కేకులన్నారు.. శిక్షణలన్నారు!
కొండ చీపుర్లు, చింతపండు కేకుల తయారీ యూనిట్లదీ అదే పరిస్థితి. ఎనిమిది మండలాలకు యంత్రాలు సరఫరా చేయగా.. చాలా చోట్ల వినియోగించడం లేదు. చింతపండును వీడీవీకేలతో కొనుగోలు చేయించి, పిక్క తీసి, కేకుల్లా మార్చి విక్రయించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు రూ.11.43 లక్షలతో ఎనిమిది యంత్రాలను అప్పట్లో కొనుగోలు చేశారు. జియ్యమ్మవలస, పాచిపెంట మండలాల్లో యంత్రాలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మిగిలిన చోట్ల మార్కెటింగ్ చేయలేక నష్టాలు చవిచూశాయి. కొండచీపుర్లు, కటింగ్ మిషన్ల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి. ఎన్ని చీపుర్లు తయారు చేశారో.. ఎంతకు అమ్మారో.. లాభనష్టాలేమిటో కూడా బయటకు రావు. ఆయా యంత్రాలను కమీషన్ల కోసమే కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పుట్టగొడుగులు, ఊదొత్తుల తయారీ శిక్షణ వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యం. అగరబత్తుల తయారీ ద్వారా రూ.50,830 లాభం వచ్చినట్లు చెబుతున్న అధికారులు.. బకాయిలున్న రూ.1,03,875 వసూలుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి సిబ్బంది ప్రమేయంతో ఆ నిధులు సైతం దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. నిధుల దుర్వినియోగం వెనుక అప్పటి గిరి వెలుగు ఏపీడీపైనే విమర్శలొచ్చాయి. సదరు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా.. మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ఇంకాస్త విమర్శలకు తావిచ్చింది.


