విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి 13 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ – 2026 పోటీలలో భారతదేశం తరఫున పాల్గొన్న విజయనగరం జిల్లాకు చెందిన పారా అథ్లెట్ కరణం గౌతమ్ (టీ–12 కేటగిరి ) 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించడం హర్షణీయమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ వేదిక మీద జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలకు భారత్ నుంచి ఆరుగురు (6) పారా క్రీడాకారులు ఎంపిక కాగా అందులో విజయనగరం జిల్లాకు చెందిన కరణం గౌతమ్ ఒకరని తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి కాంస్యం గెలుచుకున్న గౌతమ్ అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని మరింతగా పెంచాడని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.


