అధికారులే అవాక్కయ్యేలా...
విజయనగరం క్రైమ్/గుర్ల: ఆయన చేసేది హోంగార్డు ఉద్యోగం... సంపాదించింది రూ.20 కోట్లు పైబడి. ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. ఇళ్లు, స్థలాల డాక్యుమెంట్లను చూసి బిత్తరపోయారు. విజయనగరం గోకపేటలోని లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాను గురువారం జరిపిన దాడుల్లో బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఏసీబీ విభాగంలో సుమారు పదిహేనేళ్ల కిందట నెట్టి శ్రీనివాసరావు హోంగార్డుగా విధుల్లో చేరారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు చేరవేసేవారు. ఇలా వాళ్లను సేఫ్ జోన్లోకి నెట్టి.. ఆ వ్యక్తుల నుంచి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు, వివిధ ఆస్తుల రూపంలో లబ్ధిపొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో లోపాయికారి ఒప్పందంతో సంబంధాలు నెరిపేవాడు. ఆయన వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు ఏడాదిన్నర కిందట ఎస్పీ ఆఫీస్కు బదిలీ చేయించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు విజయనగరంలోని శ్రీనివాసరావు ఇల్లు, గుర్ల మండలం నడుపూరు, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలోని అధికార బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఆయన అక్రమాస్తులను గుర్తించాయి. రెండు ప్లాట్లు, ఒక ఆర్సీసీ బిల్డింగ్, నాలుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, ఒక కారు, బైక్ తదితర ఆస్తులను సీజ్చేశాయి. ఆయనను అరెస్టు చేశామని, విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.
హోంగార్డు అక్రమ సంపాదన
రూ.20 కోట్ల విలువైన ఆస్తులు
పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాల
డాక్యుమెంట్లు
విలాసవంతమైన జీవనం
అధికారులే అవాక్కయ్యేలా...


