
పెడతారంటే ఆశ..తిడతారంటే భయం అన్న చందాన అదిగో డీఎస్సీ..ఇ
విజయనగరం అర్బన్:
కూటమి ప్రభుత్వం తొలి సంతకంతో ప్రకటించిన హామీ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఎట్టకేలకు 11 నెలల తరువాత శనివారం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేడర్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివరాలను ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ యాజమాన్యాల పాఠశాలలకు చెందిన పోస్టులు 446, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మరో 137 పోస్టులు నోటిఫికేషన్లో ప్రకటించారు. అదేవిధంగా జోన్–1 (నాలుగు ఉమ్మడి జిల్లాల) పరిధిలో భర్తీ చేసే ఏపీఆర్ఎస్/ఏపీఎంఎస్/ఏపీఎస్డబ్ల్యూ/బీసీవెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్ తది తర సంక్షేమ సంస్థల గురుకులాల జోన్ల స్థాయి పోస్టులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరి పోస్టులు మరో 400 వరకు ఉన్నాయి.
జూన్ 6 నుంచి జూలై 6వ వరకు డీఎస్సీ పరీక్ష
డీఎస్సీ–2025 నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు మే నెల 15 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. మే నెల 20వ తేదీ నుంచి మాక్టెస్ట్ (నమూనా పరీక్ష) నిర్వహిస్తారు. అదే నెల 30 నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. డీఎస్సీ పరీక్షల ప్రక్రియ జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు చేపడతారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండోరోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. కీ విడుదలైన తరువాత ఏడు రోజుల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో తరగతి గది
నియామక తేదీలేని షెడ్యూల్
విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా వరకు తేదీలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మెరిట్ జాబితా తరువాత చివరిగా నూతన ఉద్యోగ ప్రవేశాల తేదీ షెడ్యూల్లో లేదు. పోస్టుల నియామక ఆదేశాల ప్రక్రియకు నిర్దిష్ట తేదీలు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి పోస్టుల నియామకాలు జరిగే అవకాశాలు లేనట్టేనని నిరుద్యోగులు అనుమాన పడుతున్నారు.

పెడతారంటే ఆశ..తిడతారంటే భయం అన్న చందాన అదిగో డీఎస్సీ..ఇ