నరసరావుపేట: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రారంభమైన నాటి నుంచి కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఫారం–6 కింద మొత్తం 10,944 దరఖాస్తులు అందాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీటిలో ఇప్పటికే 4,044 దరఖాస్తులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్యూమరేషన్ పత్రాలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన 2,51,888 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారిలో ఇప్పటికే 2,24,135 మందికి సంబంధించిన విచారణ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. 3,708 మందిని అనర్హులుగా తేల్చినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల పరిశీలన, ఎన్యుమరేషన్ పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం అక్టోబరు 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందన్నారు.
రాజీవ్ స్వగృహపై నివేదిక సమర్పించండి
అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ భవనాల వేలం కోసం కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, వినియోగంలో లేని భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని రాజీవ్ స్వగృహ భవనాలను అధికారులతో మంగళవారం కలిసి పరిశీలించారు. వేలం ప్రక్రియకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వెంట ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, సర్వేయర్ ఉన్నారు.


