నెహ్రూనగర్: రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు మాట్లాడారు.
నగరంపాలెం: వినాయకచవితి పండుగ సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని డీఎస్పీలు, ఎస్హెచ్ఓలతో సెల్ఫోన్ కాన్ఫరెనన్స్ నిర్వహించారు. వినాయక ప్రతిమల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, నిమజ్జనం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్షించారు.
నేడు నామినేషన్ల స్వీకరణ
నగరంపాలెం: గుంటూరు నగరంలోని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఈనెల 26న జరగనున్న ఎన్నికలకు బుధవారం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష పీఠం ఎవర్ని వరిస్తుందనే ఉత్కంఠ వ్యాపార వర్గాల్లో నెలకొంది. ఏళ్ల క్రితమే గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఉంది. అందులో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని వ్యాపార వర్గాలకు సభ్యత్వాలు ఉన్నాయి. సుమారు 3,200 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 26న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16న చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్ష పదవితోపాటు పలు పదవులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరగనున్న ఈ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి ఐదారు మంది అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. మూడు దశాబ్ధాలకుపైగా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా అధ్యక్ష పదవికి పోటీపడటం అనివార్యమైంది. దీంతో అప్పటి నుంచి చాంబర్ ఎన్నికలు వేడెక్కాయి. దీంతో గత రెండేళ్లు ఏల్చూరి వెంకటేశ్వర్లు అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు వ్యాపార ఓటర్ల వర్గాల్లో ఆశావాహులు ఎక్కువయ్యారు. ఈసారైనా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నూతన అభ్యర్థులు బరిలో పోటీపడనున్నారు. రెండేళ్లుగా అధ్యక్షునిగా కొనసాగిన ఏల్చూరి వెంకటేశ్వర్లు మూడోసారి హాట్రిక్ సాధించేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల స్వీకరణ ముగిసిన రోజే నూతన అధ్యక్షుడు ఎవరనేది తెలుస్తోందని చాంబర్లో బాహాటంగానే వినిపిస్తోంది.


