చందోలు(కర్లపాలెం): శ్రావణమాసం మూడవ శుక్రవారం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవారికి నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాల క్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, పండ్లు, పూజా ద్రవ్యాలు ఉచితంగా అందజేసినట్లు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
చీరాల: పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న డిగ్రీ రెండో సెమిస్టర్ పేపర్ వాల్యూయేషన్ను శుక్రవారం అధ్యాపకులు నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు మాట్లాడుతూ 2025–26లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ 1,3,4,5 సెమిస్టర్ యూజీ పేపర్ల వాల్యూయేషన్ను పూర్తి చేశామన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చినా వాల్యూయేషన్ పారితోషకం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ ఏడాది మే నెలలో 47 డిగ్రీల మేర ఎండలు ఉన్నా పేపర్ వాల్యూయేషన్ను పూర్తి చేశామని పేర్కొన్నారు. రావల్సిన పారితోషకం చెల్లించని కారణంగా శుక్రవారం రెండో సెమిస్టర్ పేపర్ మూల్యాంకనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పారితోషకాన్ని త్వరగా విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు.
నాదెండ్ల: జూనియర్ డివిజన్ సివిల్ జడ్జిల ఎంపికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర న్యాయశాఖ ప్రకటించిన మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఈ జాబితాలో గణపవరం గ్రామానికి చెందిన కాట్రు అప్పయ్య, వెంకటసుబ్బమ్మల మనుమరాలైన నల్లూరి గౌతమి 200 మార్కులకు గాను 189.67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్ష జరగ్గా, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. త్వరలో ప్రభుత్వం వీరికి జూనియర్ సివిల్ జడ్జిగా పోస్టింగ్లు ఖరారు చేయనుంది. గౌతమి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా ఒంగోలులో నివాసం ఉంటుండగా, గౌతమి విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.


