శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
1,559 పాఠశాలల్లో మెగా పీటీఎం
నరసరావుపేట ఈస్ట్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 1,584 పాఠశాలలకు గాను 1,559 బడుల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. మొత్తం 1.41 లక్షల మంది విద్యార్థులకుగాను 1.21 లక్షల మంది హాజరయ్యారు. అలాగే 1.26 లక్షల మంది తల్లిదండ్రులు, 19,862 మంది స్కూల్ కమిటీ ప్రతినిధులు, 1,303 మంది ప్రజాప్రతినిధులు, 1,117 మంది పూర్వ విద్యార్థులు, 959 మంది దాతలు, 985 మంది అధికారులు హాజరైనట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు మండల కేంద్రమైన ఈపూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నరసరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాలలతో పాటు మండలంలోని యలమంద, కోటప్పకొండ జెడ్పీ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా పీటీఎంలో పాల్గొన్నారు.
నరసరావుపేట: పల్నాడు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ వంటి సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు వారు గుర్తుచేశారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన మోదీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల ప్రాంతాలలో బంద్ విజయవంతమైందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాయి, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఆంజనేయరాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాలలు, విద్యాసంస్థల బంద్ చేయించామన్నారు. కళాశాల నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈవూరి గోపాల్రావు మద్దతు తెలిపారు. పీడీఎం సీనియర్ నేత నల్లపాటి రామారావు, ఎంఐఎం కార్యదర్శి షేక్ మస్తాన్వలి, బాదుగున్నల శ్రీనివాసరావు, విద్యార్థి నాయకులు జగదీష్, హేమంతు, శ్రీనివాస్, సన్నీ, అంజిరెడ్డి, రాజు, ఆనంద్, కొయ్య శీను, జిల్లా కార్యదర్శి ఆంజనేయ నాయక్ పాల్గొన్నారు.
న్యాయవాదుల మద్దతు
నరసరావుపేట టౌన్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి నరసరావుపేట న్యాయవాద సంఘ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విధులకు గైర్హాజరయ్యారు. కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వెళారు. అక్కడ బైఠాయించి ఢిల్లీ ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘ అధ్యక్షుడు జీవి సుబ్బారావు, న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, జి అలెగ్జాండర్ సుధాకర్, బి సలీం, షేక్ అబ్దుల్ రజాక్, కె. విజయకుమార్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల నాయకులు


