ఏఎన్యూ వద్ద కొనసాగుతున్న కాంట్రాక్ట్
అధ్యాపకుల రిలే నిరాహార దీక్షలు
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం, యూజీసీ పేస్కేల్ అమలు చేయాలని అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణించి యూజీసీ పే స్కేళ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఏఎన్యూ ప్రాంగణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గురువారం రిలే నిరాహార దీక్షలో భాగంగా కె.సందీప్, డాక్టర్ వీడీ రాజాజీ, డాక్టర్ కె.శ్రీదేవి, డాక్టర్ ఎస్కే మస్తానమ్మ, డాక్టర్ సీహెచ్ రాధిక, డాక్టర్ ఎన్.ప్రసన్న కుమార్ విధులకు సెలవు తీసుకొని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులు ముగించుకుని పెద్ద సంఖ్యలో నిరసన శిబిరానికి చేరుకొని దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కన్నెగంటి స్పోర్ట్స్ సొసైటీ వైస్ చైర్మన్గా సత్యనారాయణ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఏపీ వైస్ చైర్మన్గా కనమర్లపూడి సత్యనారాయణను నియమించారు. గురువారం స్థానిక విశ్రాంత ఎస్పీ సిహెచ్ చక్రపాణి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొసైటీ సభ్యుడిగా చక్కని సేవలందించిన సత్యనారాయణ నిబద్ధతను చూసి వైస్ చైర్మన్గా ఎంపిక చేశామన్నారు. సమాజంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల అభివృద్ధికి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సత్యనారాయణకు విశ్రాంత ఎస్పీ చక్రపాణి చేతులమీదుగా నియామకపత్రాలను అందజేసారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, ఎస్.ప్రసాద్, నాగరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు.


